ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ కూడా బంగారు తెలంగాణలో మనుషులకు లేదా?: రేవంత్ రెడ్డి ఆగ్రహం

  • ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలోని కుక్క మృతి
  • పశు వైద్యుడు, నిర్వాహకురాలిపై కేసు నమోదుచేసిన పోలీసులు
  • ప్రభుత్వ పెద్దల తీరుపై ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో హస్కీ అనే 11 నెలల శునకం ఇటీవల చనిపోయింది. దీంతో పశు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కుక్క చనిపోయిందని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆసుపత్రిలో డాక్టర్ రంజిత్, నిర్వాహకురాలు లక్ష్మీలపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై వెటకారంగా స్పందించారు.

ఓవైపు ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కుక్క చనిపోతే మాత్రం పోలీస్ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ కూడా బంగారు తెలంగాణలో మనుషులకు లేదా? అని నిలదీశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి... రాష్ట్రంలో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్న పత్రికల కథనాలను పోస్ట్ చేశారు. అలాగే తన ట్వీట్ కు తెలంగాణ సీఎం కార్యాలయం, రాష్ట్ర ఆరోగ్య శాఖలను ట్యాగ్ చేశారు.
Go Back to Shorts
Telangana
Congress
Revanth Reddy
Pragatibhavan Dog dead
Twitter

More Telugu News